వినాయక వ్రతకథ
వినాయక వ్రతవిధానము
మునులందరికీ మిక్కిలి పవిత్రమైన రమ్యమైన కైలాసపర్వత శిఖరముపై, కల్పవృక్షము నీడలో, నవరత్నములు పొదిగిన బంగారుసింహాసనము మీద పరమేశ్వరుడు కూర్చుని ఉండగా, కుమారస్వామి జనులకు మేలుచేసే సంకల్పముతో, తండ్రిని చూసి “ఓ దేవదేవా! మానవుడు ఏ వ్రతము ఆచరిస్తే, సాటిలేని సంపదలు కలుగుతాయి? పుత్రపౌత్రులతో, ధనసంపదలతో మనిషి సుఖముగా ఉంటాడు? నాకు ఇటువంటి ఉత్తమోత్తమ వ్రతమును అనుగ్రహించండి” అని అడగగా, శివుడు తన కుమారుడిని చూసి- ఇట్లా అన్నాడు.
కుమారా! సకలసంపదలను, దీర్ఘాయుష్యమును కలిగించేది, కోరిన కోరికలను తీర్చే గణపతి వ్రతము కలదు. ఆ వ్రతమును భాద్రపదశుక్ల చతుర్థినాడు ఆచరించాలి.
ఆ దినమున, ఉదయమునే లేచి స్నానము చేసి, పరిశుద్ధుడై, సంధ్యావందనము మొదలగు నిత్యకర్మలను చేసుకుని, తన శక్తికి తగినట్లు ద్రవ్యలోపము చేయక, వెండితో కాని, బంగారముతో కాని, చివరికి మట్టితో కానీ, వినాయకుడి ప్రతిమను చేసుకుని, తన ఇంటియొక్క ఉత్తరం వైపున ఒక పాలవల్లి ఏర్పరిచి, దాని మధ్యన ఎనిమిది దళములు గల కమలమును, ధాన్యముతోగానీ, బియ్యపుపిండితో కానీ ముగ్గు వేసుకోవాలి.
అచ్చట వినాయక ప్రతిమను పెట్టి, భక్తిపూర్వకంగా తెల్లని గంధముతోను అక్షతలతోను, పువ్వులతోను, గరిక పోచలతోను, 21 పత్రములతోను పూజచేసి, ధూపదీపములను సమర్పించాలి.
నేతితో వండిన కుడుములు, ఇరవై ఒక్కటి వంతున కొబ్బరికాయలను, అరటిపండ్లు, నేరేడు పండ్లు, వెలగ పండ్లు, చెరుకు గడలు, పండ్లతో పాటు, అనేక విధములగు భక్ష్యములను నైవేద్యము పెట్టి, వినాయకుని సన్నిధిలో భక్తితో పాడుతూ, నాట్యము చేసి, పురాణపఠనము మొదలైన ఉపచారములచే వినాయకుడిని ఆనందపరిచి, వేదాధ్యయన పరులైన బ్రాహ్మణులకు వాయనదానమివ్వాలి.ట
తరువాత తాను, తన బంధువులు, మిత్రులకు తృప్తిగా నూనె తగలకుండా భోజనము పెట్టవలెను. ఈ ప్రకారము, భక్తితో ఈ వినాయకవ్రతము ఆచరించు వారికి పనులన్నియు సందేహము లేకుండా సిద్ధింపగలవు.
ఆ మరుసటి దినము ఉదయాన్నే నిద్రలేచి, ముందు రోజు వలే సకలానుష్టాములు తీర్చుకుని గణనాయకునికి పునఃపూజ చేయవలెను. ఆ రోజున ఒక బ్రహ్మచారికి వినాయకుని ప్రీతికై ముంజదర్భత్రాటిని, కృష్ణాజినమును, దండమును, యజ్ఞోపవీతమును, కమండలమును, వస్త్రమును తన శక్తికి తగినట్టుగా ఇవ్వవలెను. తరువాత పురోహితునికి శక్తికి లోపములేకుండా వాయనం ఇవ్వవలెను. మిగిలిన బ్రాహ్మణులకు శక్తికొలది దక్షిణలిచ్చి, భోజనము పెట్టవలెను.
ఇది వ్రతములలో కెల్లా ఉత్తమమైన వ్రతము. మూడు లోకముల యందునూ ప్రసిద్ధి చెందినది. ఈ వ్రతమును పూర్వకల్పమున దేవతలు, మునులు, గంధర్వులునూ, కిన్నెరుల మొదలైన అనేకులు ఆచరించిరి.
ఓ ధర్మరాజా! నీవును ఈ ప్రకారముగా గణపతి పూజ చెయ్యి. నీకు తప్పక జయము కలుగును. నా మాట నమ్ము. ఇది నిజము.
ఈ వ్రతమును భూ లోకములో ఎందరో ఆచరించిరి. ఈ వ్రతము చేసిన దమయంతి నలుడిని భర్తగా పొందెను.
కృష్ణుడాచరించి జాంబవతిని, శ్యమంతకమణిని పొందెను.
ఇంద్రుడు వృత్రాసురుడిని చంపెను.
రావణుడు సీతను ఎత్తుకుపోయినప్పుడు, రాముడు ఈ వ్రతము చేసి సీతను పొందెను.
భగీరథుడు గంగను తీసుకువచ్చినప్పుడూ, దేవాసురలు అమృతమథనములోనూ, సాంబుడు తన కుష్ఠు రోగము తొలగిపోయే నిమిత్తముగా ఈ గణనాథవ్రతము ఆచరించి తమతమ కోరికలను పొందిరి.
ఈ విధంగా సూత మహాముని చెప్పగానే, ఆ ప్రకారముగా సోదరులతో పాటుగా ధర్మరాజు గణపతి పూజచేసి, శత్రువులను చంపి, రాజ్యమును సంపాదించి సుఖపడిరి.
మనసులో తలచిన కార్యములు కూడా జరుగుచుండెను. కనుకనే ఆ వినాయకుడికి సిద్ధివినాయకుడని పేరు వచ్చినది. ఈ గణనాథుని అర్చించి, విద్యారంభము చేస్తే, విద్య బాగా వస్తుంది.
జయము కోరేవారు పూజ చేస్తే, జయము కలుగును.
బిడ్డలు కోరేవారు పూజచేస్తే బిడ్డలు పొందుదురు.
సుమంగళీ స్త్రీలు పూజిస్తే సౌభాగ్యమును పొందుతారు.
విధవస్త్రీలు పూజిస్తే, పై జన్మలో విధవత్వము రానే రాదు.
బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య,శూద్రులు అనే నాలుగు వర్గాలవారు, స్త్రీలు, పిల్లలు ఎటువంటి భేదములేకుండా, ఈ వ్రతమును యథావిధిగా చేయవలెను. గణనాథుడి ప్రసాదము వలన, మనుష్యులకు సకల కార్యములు సిద్ధిస్తాయి.
పుత్రపౌత్రాభివృద్ధి, ఏనుగులను ఉంచుకోగల కలిమి కలుగును- అని పాండురాజపుత్రుడికి సూతమహామునిక ఉపదేశించగా, అతడట్లా చేసి సకలైశ్వర్యములను పొందెను.
ఇది శ్రీ స్కాందపురాణమున ఉమామహేశ్వర సంవాదమున వినాయకకల్పము సంపూర్ణము.
(వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి.)
విఘ్నేశ్వరుడి కథ
సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుడి కథ ఇలా చెప్పాడు.
పూర్వం గజ రూపం కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి?' అని అడిగితే, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు.
కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుడి బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో, నా భర్తను కాపాడవలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి, గజాసురుడి రాజ్యానికి వెళ్ళి, సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహనీయుడైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే- అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివుడితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి, నా చర్మం నీ వస్త్రంగా ధరించమని' వేడుకొన్నాడు.
అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు.
అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
వినాయక జననం
కైలాసంలో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుడి రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వద్దని చెప్పింది.
ఇంతలో శివుడు రానే వచ్చాడు. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరుడినే ఎదుర్కొని, తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరశ్ఛేదం చేసి, లోపలికి వెళ్లాడు.
అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని, పతిదేవుడైన శివుడికి ఎదురెళ్ళి, ప్రియ సంభాషణలు చేస్తుండగా, ద్వారం దగ్గర ఉన్న బాలుని ప్రసక్తి వచ్చింది.
శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు. ఆ బాలుడిక వాహనం అనింద్యుడనే ఎలుక.
గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు. అతని వాహనం నెమలి. అతను మహా బలశాలి.
విఘ్నేశాధిపత్యం
ఒక రోజు దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'మాకు ఏ పనిచేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక అధిపతిని కనికరించమని' కోరారు. ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు, 'మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్య నదులలో స్నానం చేసి ముందు వస్తారో, వాళ్లే ఈ పదవికి అర్హులు' అన్నాడు. దానికి అంగీకరించిన కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనమెక్కి వెళ్లి పోయాడు.
గజాననుడు మాత్రం చిన్న బోయిన ముఖంతో 'తండ్రీ! నా బలాబలాలు తెలిసీ మీరిలాంటి పరీక్ష విధించటం సబబేనా? నేను మీ పాదసేవకుడిని కదా! నా మీద దయ తలచి ఏదైనా తరణోపాయం చెప్పమని కోరాడు. అంతట శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు.
"సకృన్నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశత త్రయమ్! గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక!'
కుమారా! ఇది నారాయణ మంత్రం! ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్య నదులలో స్నానం చేసినట్టవుతుంది.
పరీక్ష పెట్టినదీ తండ్రే, తరణోపాయం చూపిందీ తండ్రే కాబట్టి, ఇంక తాను గెలవగలనో లేదో, కుమార స్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను? అని సందేహించకుండా, భక్తి శ్రద్ధలతో ఆ మంత్రమును జపిస్తూ, మూడు మార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండి పోయాడు.
అక్కడ కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు. అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అన్నగారు, తండ్రి పక్కనే ఉన్నాడు.
తన అహంకారానికి చింతించి, 'తండ్రీ! అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండీ' అన్నాడు.
ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు, విఘ్నేశ్వరుడైనాడు. ఆ రోజు అన్ని దేశాల లోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకం, వడపప్పు సమర్పించారు.
విఘ్నేశ్వరుడు, తృప్తి పడి తిన్నంత తిని, తన వాహనానికి పెట్టి, తీసుకెళ్ల గలిగినంత తీసుకుని భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు. ఎప్పటిలాగా తల్లిదండ్రులకు వంగి, నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు.
చేతులసలు నేల కానితేనా? పొట్ట వంగితేనా? అలా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే, శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపకా నవ్వాడు.
చంద్రుడిని రాజ అనికూడ పిలుస్తారు. రాజు చూపు సోకితే, నాశనమే అంటారు కదా. అలాగే, వినాయకుని పొట్ట పగిలి, కుడుములన్నీదొర్లుకుంటూ బయటకు వస్తాయి.
పార్వతీ దేవి దుఃఖించుచూ, చంద్రుడిని ఇలా శపించింది. 'ఓరీ పాపాత్ముడా! నీ చూపు తగిలి, నా కొడుకు మరణించాడు. అందుకని నిన్ను చూసిన వాళ్లు, పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు.'
ఋషి పత్నులు నీలాప నిందలు పొందుట
ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణలు చేస్తున్నారు. అగ్ని దేవుడు ఆ ఋషిపత్నులను చూసి మోహించాడు. కాని ఋషుల శాపాలకు భయ పడ్డాడు. అతడి ఇంగింతం గ్రహించిన అగ్ని దేవుని భార్య, ఒక్క అరుంధతీ రూపం తప్ప మిగతా అందరి రూపం ధరించి అతడికి ఆనందం కలిగించింది.
కానీ, ఋషులు ఆ సన్నివేశమును చూసి – అగ్నితో ఉన్నది తమ భార్యలే అని పొరబడ్డారు. దీనికి కారణం, వారు చంద్రుని చూడటమే!ౢ
ఈ ఉపద్రవమును గురించి దేవతలు, మునులు వెళ్ళి, శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకోగా, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, అసలు విషయం తెలుసుకుని ఋషులకు వివరించి, వాళ్ల కోపమును పోగొట్టాడు. ఆ తరువాత, కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుడిని బతికించి, అమరత్వాన్ని ప్రసాదించాడు.
అప్పుడు దేవతలు మొదలైనవారంతా, 'ఓ పార్వతీ! నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు. నీ శాపాన్ని ఉపసంహరించు' అన్నారు. పార్వతి కూడా తన కుమారుని ముద్దాడి, 'ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడ రాదు' అని శాపోపశమనమును కలుగచేసింది.
ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి. ఆ రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఇలా కొన్నాళ్ళు జరిగింది.
శ్యమంతకోపాఖ్యానం
ద్వాపర యుగంలో ద్వారకలోనున్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ప్రసంగవశాన, చంద్రుడి శాపవిషయమును కూడా చెప్పాడు. "ఆ శాపం పొందిన వినాయక చవితి ఈ రోజే కాబట్టి, నేను తొందరగా వెళ్ళాలి" అనేసి స్వర్గానికి వెళ్లిపోయాడు.
కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుడ్ని చూడవద్దని చాటింపు వేసాడు. అతనికి పాలంటే ప్రీతి కదా! తనే స్వయంగా పాలను పితుకుదామని, ఆకాశం కేసి చూడకుండా, ఆవు దగ్గర కెళ్ళి పాలు పితుకుతూంటే, పాలలో చంద్రబింబం కనిపించింది. హతవిధీ! నేనేమీ నీలాప నిందలు పడాలో కదా!' అనుకున్నాడు.
కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరకి వచ్చాడు. అతడు శ్యమంతకమణిని సూర్యవరం వల్ల పొందాడు. శ్రీ కృష్ణుడది చూసి ముచ్చటపడి, తనకిమ్మని అడిగాడు.
ఈ మణి రోజుకు ఎనిమిది బారువులు బంగారాన్నిస్తుంది. అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు ' అన్నాడు సత్రాజిత్తు. దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు.
ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్లాడు. అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసమనుకుని అతడిని చంపి, మణిని తీసుకుని పోతూండగా, జాంబవంతుడనే ఒక భల్లూకం ఆ సింహమును చంపి, ఆ మణిని తన గుహకు తీసుకుని పోయి, తన కూతురికి ఆట వస్తువుగా యిచ్చాడు.
ఇదంతా తెలియని సత్రాజిత్తు 'ఇంకేముంది మణిని ఇవ్వలేదని కోపంతో, శ్రీకృష్ణుడే నా తమ్ముడిని చంపి మణి తీసుకున్నాడని ' చాటింపు వేసాడు.
శ్రీ కృష్ణుడు 'తను భయపడినట్టుగా నీలాపనిందలు రానేవచ్చాయి. దానినెలాగైనా రూపు మాపాలి ' అని సంకల్పించి, సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రసేనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహవైపుకి భల్లూకం అడుగుజాడలు కనిపించాయి.
ఆ దారివెంట పోయి, గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని, వస్తూంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది.
అది విన్న జాంబవంతుడు కోపంగా, శ్రీహరిమీదకి యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య యిరువయ్యెనిమిది రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరి యుద్ధం జరిగింది.
రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు. అప్పుడతడు తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు, త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు.
వెంటనే చేతులు జోడించి 'దేవాధిదేవా! ఆర్తజనరక్షకా! నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామ చంద్రునిగా గుర్తించాను. ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే, నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు భవిష్యత్తులో తీరుతుందన్నావు.
అప్పటినుంచీ నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను. నా ఇంటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడిని స్వామీ! నాలో శక్తి క్షీణిస్తోంది. జీవితేచ్ఛ నశిస్తోంది. నా అపచారం మన్నించి నన్ను కాపాడు. నీవే తప్పనితః పరంబెరుగను ' అని పరిపరి విధాల ప్రార్థించాడు.
శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి 'జాంబవంతా! శ్యమంతక మణిని అపహరించానన్న నింద వచ్చింది. దాన్ని రూపుమాపడానికి వచ్చాను. నువ్వు ఆ మణినిస్తే నేను వెళ్ళివస్తాను ' అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా మణిని, తన కూతురు జాంబవతినీ కూడా కానుకగా ఇచ్చాడు.
తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో, శ్యమంతకమణితో, జాంబవతితో సత్రాజిత్తు దగ్గరకెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది, లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు.
ఆ పాపపరిహారంగా తన కుమార్తె, సత్యభామని భార్యగా స్వీకరించమని అ మణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరించి, మణిని మృదువుగా తిరస్కరించాడు.
ఒక శుభముహుర్తాన శ్రీకృష్ణుడు సత్యభామనీ, జాంబవతినీ పెళ్ళి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవాది దేవతలు, ఋషులు శ్రీకృష్ణునితో 'స్వామీ! మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నారు. మాబోటి అల్పుల మాటేమిటి?' అన్నారు.
శ్రీహరి వారియందు దయతలిచి 'భాద్రపద శుద్ధ చవితిరోజు ప్రమాదవశాన చంద్ర దర్శనం అయినా, ఆ రోజు ప్రొద్దున గణపతిని యథావిధిగా పూజించి, శ్యమంతకమణి కథను విని, పూజాక్షతలు తలమీద వేసుకుంటే, ఎటువంటి అపనిందలు పొందరు' అని పరిష్కారము చెప్పగా దేవతలు, మునులు సంతోషించారు.
కాబట్టి మునులారా! అప్పటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు, అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు ' అని సూతముని శౌనకాది మునులతో చెప్పారు. (మంత్రాక్షతలను శిరసుపై ధరించాలి.)
గం గణపతయే నమః
శ్యమంతక ఉపాఖ్యాన సంగ్రహ శ్లోకము
సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః.
సుకుమారక మా రోదీః - తవ హ్యేష శ్యమంతకః..
వ్రతకథ సమాప్తము
|