116
04 अ    11 None    06 None    01 काण्ड    01 प्रपा   

                        
                        
శ్రీరామ నవమీ వ్రత కథ Sri Rama Navami Vrata Kathaa పూర్వము అగస్య్త మునీంద్రుడు, సుతీక్ష్ణ మునీంద్రులతో ఇలా చెప్పసాగెను. చైత్రమాస శుద్ధ నవమి నాడు సచ్చిదానంద స్వరూపుడైన మహవిష్ణువు రఘువంశమున జన్మించెను. కనుక ఈ నవమిరోజున యథాశక్తిగా రాముని ప్రతిమను మండపమున ఉంచి, షోడశోపచార పూజను చేసి, ఆ రాత్రి పురాణ శ్రవణములతో జాగారము చేసి, మరుసటి రోజున ఉదయమే లేచి, నిత్యకర్మలను ఆచరించి, తనవంతు శక్తితో శ్రీ రామునికి పునః పూజను చేసి, బ్రాహ్మణులకు ఫలదక్షిణములను ఇచ్చి, అన్న సంతర్పణ చేయవలెను- అని. ఇలా భక్తి పూర్వకంగా శ్రీరామనవమి వ్రతము రోజున రాముని పూజ చేసిన వానికి, అనేక జన్మములలో చేసిన పాపములు నశించును. ఈ వ్రతమును శుద్ధమనస్కులై భక్తిశ్రద్ధలతో ఆచరించిన వారికి, సమాజములో అందరిచే గౌరవము లభించును. ఈ వ్రతమును చేయనివారికి తక్కిన ఏవ్రతము చేసినా ఫలప్రాప్తి ఉండదు. అంతేకాదు. శ్రీ రామ నవమినాడు ఉపవాసము చేయని మానవుడు, భయంకరమైన కుంభీపాకాది నరకానికి పోతాడు. శ్రీరామ ప్రతిమను దానము చేసిన వారు ముక్తిని పొందుతారని, అగస్త్యముని చెప్పగా సుతీక్ష్ణముని మరల ఇలా అడిగెను. ఓ మునీంద్రా- లోకములో ప్రజలు ధనహీనులుగానూ, మరియు ధనము వున్నా కూడా లోభులుగా ఉన్నారు. వారు ఈ వ్రతము ఎలా చేయగలరు? అని ప్రశ్నించెను. అప్పుడు అగస్త్యుడిలా చెప్పసాగెను - ఓ సుతీక్ష్ణా- ప్రజలు వారి శక్త్యానుసారముగా, ఎటువంటి లోపము లేకుండా శ్రీ రామ ప్రతిమను చేయించి, ఈ ప్రతిమలో శ్రీరాముడిని ఆవాహనచేసి, పూజించి దానము చేయవలేను. దరిద్రముతో ఉన్నవారైననూ ప్రయత్నపూర్వకంగా ఈ వ్రతము చేసినట్లైతే, వారు సకల పాపముల నుండి విముక్తిపొంది, సిరిసంపదలను పొందుతారని అగస్త్యుడు చెప్పెను. పిదప, సుతీక్ష్ణుడు, శ్రీ రామ మూలమంత్ర ప్రభావమును, వివరించమని అగస్త్యుడిని కోరగా, అగస్త్యుడు బదులు చెప్పెని- ఓ సుతీక్ష్ణా, సమస్త రామమంత్రములలోనూ శ్రీ రామ షడక్షరీమంత్రము ఉత్తమమని స్కాంద పురాణములో మోక్షఖండమునందు మరియు రుద్రగీత అనే గ్రంథమునందు చెప్పబడినది. శ్రీరాముడుని గూర్చి రుద్రుడు కూడా ఇలా చెప్పెను.- ఓ రామా మణికర్ణికాతీరమందు మరణము పొందిన ప్రతి మానవుని కుడిచెవిలో శ్రీ రామ రామ రామ- అని నీ తారకమంత్రమునే ఉపదేశిస్తున్నాను. కావున నీవు తారకబ్రహ్మ అగుచున్నావని చెప్పెను. కనుక, పూజా ప్రారంభమున పీఠ దేవతా- అంగగదేవతా పూజను చేసి, శ్రీ రఘురాముని షోడశోపచారములతో పూజను చేసినవారు అనేక జన్మలలో చేసిన పాపముల నుండి విముక్తి కలిగి మోక్షమును పొందును. ఈ వ్రతమును యోగ్యమైన భక్తులకు మాత్రమే ఉపదేశము చేయుట మంచిది. మరియు శ్రీరామ ప్రతిమను బంగారంతో కాని, వెండితో కాని చేయించి, రాముని ఆవాహన చేసి, శ్రద్ధగా పూజనుచేసి నవమి రోజున ఉపవాసము చేసి, తెల్లవారిన తరువాత పునఃపూజను చేసి బ్రాహ్మణులను భోజన, దానాలతో సంతోషపెట్టినట్లైయతే, శ్రీరాముడు వారికి సకల సంపదలను అనుగ్రహించి, మోక్షమును ప్రసాదించును. అంతేకాదు. ఈ వ్రతము పన్నెండు సంవత్సరములు చేసివారికి సర్వపాపముల నుండి విముక్తి కలుగును. రామమంత్రము గురించి తెలియనివారు కేవలం రామస్మరణ చేసినచో, వారికి అటువంటి ఫలము కలుగును అని అగస్య్త మునీంద్రుడు చెప్పగా, సుతీక్ష్ణముని ఈ వ్రతమును ఆచరించి మోక్షమును పొందెను. ఇతి శ్రీరామనవమి వ్రత కథా సంపూర్ణం. ==00==